
తన నటనతో, డైలాగ్ డెలివరీతో తెలుగు ప్రేక్షకుల నుండి అశేష అభిమానాన్ని పొందిన నటుడు తనికెళ్ళ భరణి. నటుడు కాకముందు ఆయన అద్భుతమైన సినిమాలకు రచనా సహకారం అందించడంతో పాటు మరచిపోలేని బలమైన సంభాషణలు కూడా సమకూర్చారు. ఆయన తరహా సంభాషణలు తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించాయన్న విషయంలో అతిశయోక్తి లేదు. నటుడిగా బిజీ అయిపోయిన తర్వాత ఆయన రచయితగా చాలా తక్కువ సార్లే పని చేశారు.
ఈ మధ్య కాలంలోనే దర్శకుడిగా మారి మళ్ళీ తన టేస్ట్ ఏంటో నిరూపించారు. మిథునం సినిమా ద్వారా తెలుగు సినిమాకు ఓ క్లాసిక్ సినిమాను అందించారు. తాజాగా ఆయన మళ్ళీ పెన్ను పట్టే సూచనలు కనిపిస్తున్నాయ్! త్వరలో ఓ కొత్త సినిమాకు తనికెళ్ళ భరణి రచనా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ‘మృదుల’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో అమైరా దస్తూర్ నటించనున్నట్లు తెలుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా మృదుల తెరకెక్కనుందనేది టాక్. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా తనికెళ్ళ భరణి లాంటి ఓ మంచి రచయిత మళ్ళీ తన కథలతో సినిమాలు తీయడం నిజంగా తెలుగు ప్రేక్షకులకు శుభవార్తే!

