కరోనా కారణంగా సినిమా థియేటర్లు ఏడాది పాటుగా మూతపడ్డాయి. దీంతో థియేటర్ల యజమానులు భారీగా నష్టపోయారు. అయితే థియేటర్లకు ఆర్థికంగా వెసులుబాటు కలిగించేలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు పార్కింగ్ ఫీజులు వసూలు చేసుకోవచ్చని నిన్న తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, ఎగ్జిబిటర్లు హర్షం వ్యక్తం చేశారు.
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేశారు. మా అభ్యర్థనను మన్నించి థియేటర్లకు ఊరట కల్పించేలా నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఈ నెల 30 నుంచి థియేటర్లను 100 శాతం ఆక్యుపెన్సీతో తెరిచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.