కరోనా మహమ్మారి సినీ పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీసింది. కరోనా ఫస్ట్ వేవ్ నుంచి కోలుకోకముందే సెకండ్ వేవ్ వచ్చి పడడంతో ఇండస్ట్రీ పూర్తిగా కుదేలైపోయింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, సినిమా థియేటర్లు తెరుస్తుండడంతో చాలా సినిమాలు రిలీజ్కి సిద్దమయ్యాయి. తెలంగాణలో రేపటి నుంచి వంద శాతం ఆక్యుపెన్సీతో, ఏపీలో ఎల్లుండి నుంచి 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకోనున్నాయి.
అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్ల వైపు వస్తారా అనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను ఆలోచింపచేస్తున్న ప్రశ్న. అయితే ఫస్ట్ వేవ్ తర్వాత థియేటర్లు తెరుచుకున్న సమయంలో వచ్చిన సోలో బ్రతుకు సో బెటర్, క్రాక్, మాస్టర్, రెడ్, ఉప్పెన, నాందీ, జాతి రత్నాలు, వకీల్ సాబ్ వంటి సినిమాలు మంచి సక్సెస్ను అందుకోవడంతో ఇప్పుడు కూడా ప్రేక్షకుల నుంచి అదే రెస్పాన్స్ ఉంటుందన్న ఆశతో ఇండస్ట్రీ వర్గాలు ఉన్నాయి. ఈ ఆశతోనే రేపు తిమ్మరుసు, ఇష్క్, నరసింహపురం వంటి చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ సినిమాలు బిగ్ స్క్రీన్పై బోణీ కొడతాయా? ప్రేక్షకుల అటెన్షన్ను థియేటర్ల వైపుకు మళ్లిస్తాయా లేదా అనేది చూడాలి మరీ.