‘ఈగ’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రాలతో ఉత్తమ అభిరుచి గల నిర్మాతగా నిరూపించుకున్న ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి నిర్మించిన తాజా సినిమా ‘తుంగభద్ర’. ఈ సినిమా ద్వారా గోగినేని శ్రీనివాస కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నేడు ఈ సినిమా ఆడియో విడుదల కానుంది.
‘కథ’ ఫేం అదిత్ అరుణ్, డింపుల్ చోపడే జంటగా నటించిన ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల నుండి జరుగుతుంది. రాయలసీమ నేపధ్యంలో రెండు గ్రామాల మధ్య పోరాటం ప్రధానాంశంగా సినిమాను తెరకెక్కించారు. పల్లెటూరి రాజకీయాల నేపథ్యంలో సాగే ఓ అందమైన ప్రేమకథ ఇది. తమిళ నటుడు సత్యరాజ్ సత్యరాజ్ కీలక పాత్రలో నటించారు.
హరి గౌర సంగీతం అందించిన ఈ సినిమాలో పాటలను రామజోగయ్య శాస్త్రి, సాహితి రచించారు. వెల్ రికార్డ్స్ ద్వారా ‘తుంగభద్ర’ ఆడియో మార్కెట్లోకి విడుదలవుతుంది.


