‘పిల్లా.. నువ్వులేని జీవితం’ అంటూ మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన మరో హీరో సాయి ధరమ్ తేజ్. తన మొదటి సినిమాతోనే హిట్ అందుకోవడంతో పాటు, తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. తాజాగా ఆయన హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. దిల్రాజు నిర్మాతగా రూపొందిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని సెప్టెంబర్ రిలీజ్కు సిద్ధమవుతోంది. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ పూర్తైన వెంటనే రెండు వరుస సినిమాలను లైన్లో పెట్టి జోరు మీదున్నాడు సాయి ధరమ్ తేజ్.
ఇక ఈ రెండు సినిమాల్లో ఒకటి దిల్రాజు నిర్మాతగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందే సినిమా కాగా, మరొకటి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ఓమ్(3D) దర్శకుడు సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా. సెప్టెంబర్ నెలలో దిల్రాజు సినిమా సెట్స్పైకి వెళ్ళనున్న విషయం తెలిసిందే. ఇక సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా వచ్చే వారమే సెట్స్పైకి వెళ్ళనుంది. రేపు ఉదయం ఈ సినిమా అఫీషియల్గా పూజా కార్యక్రమాలతో లాంచ్ కానుంది. సాయి ధరమ్ తేజ్ బాడీ లాంగ్వెజ్కు సెట్ అయ్యే లవ్ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండనుందని సమాచారం.