‘ఏ మాయ చేసావే’ సినిమాతో మ్యాజిక్ చేసిన హీరో నాగ చైతన్య, దర్శకుడు గౌతమ్ మీనన్ల క్రేజీ కాంబినేషన్లో ‘సాగసం శ్వాసగా సాగిపో’ అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. టీజర్ రిలీజ్ అప్పట్నుంచే విపరీతమైన అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా గౌతమ్ మీనన్ మార్క్ సినిమాగా తెరకెక్కిందన్న ప్రచారంతో ఆ అంచనాలను మరింతగా పెంచుకుంది. మ్యూజిక్ సెన్సేషన్ ఏ.ఆర్.రహమాన్ అందించిన పాటలు ఈ సినిమాకు మేజర్ హైలైట్గా నిలవనున్నాయని తెలుస్తోంది.
ఇప్పటికే విడుదలైన ‘ఎళ్ళిపోమాకే’ అనే పాట సూపర్ హిట్ అయిన తర్వాత ఆడియో కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జూన్లో ఆడియో విడుదల కానుండగా, ఈ లోపునే ఒక్కో పాటను విడుదల చేసేందుకు టీమ్ ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే నేడు సాయంత్రం 6 గంటలకు ‘చక్కోరి’ అనే పాటను విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ వర్షన్లో శింబు హీరోగా నటించారు. రెండు భాషల్లోనూ మంజిమా మోహన్ హీరోయిన్గా నటించారు. జూలై 15న సినిమా విడుదల కానుంది.