
బాలీవుడ్లో గత కొన్నాళ్ళుగా లేడీ ఓరియంటడ్ సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాల్లో లేడీ ఓరియంటడ్ సినిమాలు ఇటు విమర్శకుల ప్రశంసల పరంగానూ, బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగానూ సూపర్ అనిపించుకున్నాయి. ఇప్పుడా కోవలో తెలుగులో ఈమధ్యే విడుదలైన ‘జ్యోతిలక్ష్మీ’ కూడా బాలీవుడ్లో అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, ఛార్మీ టైటిల్ రోల్లో నటించిన సినిమా ‘జ్యోతిలక్ష్మీ’. గత వారం విడుదలైన ఈ సినిమాలోని సోషల్ మెసేజ్కు మంచి స్పందన వస్తోంది.
ఇక ఈ సినిమాకు వస్తున్న స్పందన గురించి మాట్లాడుతూ, ఛార్మీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సినిమాకు అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ ఉందని, సోషల్ మెసేజ్ను అందరూ మెచ్చుకుంటున్నారని ఛార్మీ అన్నారు. అదే విధంగా బాలీవుడ్లో పేరొందిన ఓ నిర్మాణ సంస్థ జ్యోతిలక్ష్మీ హిందీ రీమేక్ హక్కుల కోసం సంప్రదించిందని, త్వరలోనే ఆ వివరాల గురించి చెబుతానని ఛార్మీ ఈ సందర్భంగా తెలిపారు. సి. కళ్యాణ్తో కలిసి ఛార్మీ ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే!