తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒకప్పుడు అగ్ర కథానాయిక గా వెలుగిందిన పాపులర్ హీరోయిన్స్ లో నటి మంజుల కూడా ఒకరు. సీనియర్ ఎన్టీఆర్ తో మనుషులంతా ఒక్కటే, మగాడు, నేరం నాది కాదు ఆకలిది, ఏయన్నార్ తో దొరబాబు, బంగారు బొమ్మలు, మహాకవి క్షేత్రయ్య, కృష్ణ తో మాయదారి మల్లిగాడు, రక్తసంబంధాలు, శోభన్బాబు తో మంచి మనుషులు, పిచ్చిమారాజు వంటి ఎన్నో సూపర్ హిట్స్ లో నటించారు. మంజుల కూతురు వనిత ను ‘ దేవి ‘ తో నటిగా పరిచయం చేశారు ఎంఎస్ రాజు.
ఇప్పుడు మంజుల మనవరాలు, వనిత కుమార్తె జోవికా విజయ్ కుమార్ను తన హారర్ థ్రిల్లర్ ‘అగధ’ తో నటిగా పరిచయం చేస్తున్నారు ఎంఎస్ రాజు. ఇందులో ఆమె పాత్ర పేరు ‘ హరిణి ‘. ఆమె క్యారెక్టర్ పోస్టర్ ని ఈరోజు విడుదల చేశారు.
జోరున కురుస్తోన్న వర్షం లో మసకబారిన పురాతన నేపథ్యంలో, జోవికా అద్భుతమైన రూపంలో కనిపిస్తుంది. ఆమె హావభావాలు పలికించే కళ్ళలో అమాయకత్వం, దాగి ఉన్న శక్తి కలగలిసి ఉన్నాయి.
ఇది కథ యొక్క ఆధ్యాత్మిక, మర్మమైన మూలాలతో గాఢంగా ముడిపడి ఉన్న పాత్రను సూచిస్తుంది. ‘అగధ’ కు సంబంధించి ఇప్పటివరకూ విడుదల చేసిన అన్ని పోస్టర్లు ఈ సినిమా తాలూకు ఇంటెన్సిటీ ని ఆవిష్కరించే విధంగా ఉన్నాయి.
ఎం. ఎస్. రాజు రచన, దర్శకత్వం లో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్పై కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
85 రోజుల షూటింగ్, విస్తృతమైన సెట్ వర్క్ మరియు దాదాపు 45 నిమిషాల విఎఫ్ఎక్స్ తో, ‘అగధ’ ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని యూనిట్ చాలా నమ్మకంగా ఉంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇది పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
