సై, ఛత్రపతి, గజిని చిత్రాల నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత.. ముంబైలో హఠాన్మరణం

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన విలనిజంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు ముంబైలో ఆయన తుదిశ్వాస విడిచారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది.

1952 జనవరి 21న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ప్రదీప్ రావత్ జన్మించారు. పలు భారతీయ భాషల్లో నటించిన ఆయన, దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘సై’ చిత్రంతో తెలుగు సినీ రంగానికి పరిచయమయ్యారు. ఈ సినిమాలో ఆయన పోషించిన ‘భిక్షు యాదవ్’ పాత్ర విశేష ప్రజాదరణ పొందింది.

ఆ తర్వాత ‘ఛత్రపతి’లో రాజ్ బిహారీగా, ‘గజిని’ చిత్రంలో ప్రతినాయకుడిగా శక్తివంతమైన పాత్రలు పోషించారు. వీటితో పాటు భద్ర, దేశముదురు, స్టాలిన్, ఓయ్, నేను శైలజ సహా పలు విజయవంతమైన తెలుగు సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రదీప్ రావత్ మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

Exit mobile version