హెచ్.టీ సినిమాస్ ఎల్.ఎల్.పి పతాకంపై రూపొందుతున్న నూతన చిత్రం ‘పాటకు ప్రాణం’ హైదరాబాద్లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్లో ప్రారంభమైంది. దర్శకుడు సురేందర్ రెడ్డి, నటుడు నిఖిల్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. హేమల్ తుమ్మపూడి దర్శకత్వం వహిస్తూ శ్రీరామ్ తుమ్మపూడితో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 24 నుంచి మొదలుకానుంది. సుమారు 60 ఏళ్లుగా వెనుకబడిపోయిన రామయ్య అనే వ్యక్తి, 20 ఏళ్ల ఓ యువకుడు కలిసి సాగించే సంగీత ప్రయాణం చుట్టూ కథ నడుస్తుందని దర్శకుడు హేమల్ తెలిపారు. సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ చిత్రంలో సుదర్శన్ వంగల (అరుణ్ పాత్ర), సాత్విక (రాధ పాత్ర) జంటగా నటిస్తున్నారు. సీనియర్ నటుడు తనికెళ్ల భరణి కీలక పాత్ర పోషిస్తుండగా, రాజీవ్ కనకాల, అనితా చౌదరి, రఘు కారుమంచి, బ్రహ్మాజీ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. పాత తరం సంప్రదాయ సంగీత విద్వాంసుడికి, నేటి జెన్-జీ సంగీతకారుడికి మధ్య జరిగే కథాంశంతో, పాటలకు ప్రాధాన్యమిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు నటుడు తనికెళ్ల భరణి పేర్కొన్నారు.
ఈ చిత్రానికి సంజీత్ సింగ్ ఛాయాగ్రహణం, ప్రభాత్ రెడ్డి బండ కూర్పు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
