
మాస్ మాహారాజ్ రవితేజ హీరోగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తోన్న సినిమా ‘బెంగాల్ టైగర్’. ‘ఏమైంది ఈవేళ’, ‘రచ్చ’ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది, రవితేజ స్టైల్లో ఓ మాస్ కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మధ్యే ‘కిక్ 2’ సినిమాతో అభిమానులను మెప్పించిన రవితేజ, వెంటనే ‘బెంగాల్ టైగర్’ను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈవారమే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్లుక్ను విడుదల చేసేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటివరకూ ఫస్ట్లుక్, స్టిల్స్ ఇలా ఈ సినిమాకు సంబంధించిన వివరాలేవీ ఇప్పటికీ బయటకు రాకపోవడంతో ఈ సినిమా ఫస్ట్లుక్ ఎలా ఉంటనుందనేది ఆసక్తికరంగా మారింది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. బొమాన్ ఇరానీ, హర్ష వర్ధన్ రానే వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలు ఉంటాయని సినిమా యూనిట్ చెబుతోంది.

