
దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన బాహుబలి సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కురిపించిన విషయం తెలిసిందే. మొత్తం రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగమే ఈ స్థాయి ప్రభంజన సృష్టిస్తే ఇక వచ్చే ఏడాది విడుదలయ్యే రెండో భాగం ఇంకెంత ప్రభంజనం సృష్టిస్తుందో అని అభిమానులు ఇప్పట్నుంచే ఎదురుచూస్తున్నారు. కాగా బాహుబలి విషయంలో ఒక కథనం గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది.
బాహుబలి పార్ట్ 2తో పూర్తవదని, బాహుబలికి మూడో భాగం కూడా ఉంటుందన్నది ఈ కథనాల సారాంశం. బాహుబలిపై వస్తోన్న ఇలాంటి కథనాలపై రాజమౌళి కొద్దిసేపటి క్రితం స్పందించారు. బాహుబలి మూడు భాగాలు ఉంటుందన్న విషయంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. పార్ట్ 2తోనే బాహుబలి కథ పూర్తవుతుందని, ఈ కథ ఇంకా కొనసాగదని తెలిపారు. అయితే బాహుబలి ప్రపంచం మాత్రం కొనసాగుతుందని, అదెలాగో తనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయని, సమయం వచ్చినపుడు వాటి గురించి చెబుతానని రాజమౌళి తెలపడం ఆసక్తికరంగా కనిపిస్తోన్న అంశం!

