
‘కుమారి 21 ఎఫ్’.. గత కొద్దికాలం వరకూ ఎవ్వరికీ పెద్దగా పరిచయం కూడా లేని ఈ సినిమా, ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ సినిమాగా మారిపోయింది. విలక్షణ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి సుకుమార్ రైటింగ్స్ అన్న బ్యానర్పై రూపొందించిన ఈ సినిమా ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి టాప్ హీరోల ప్రమోషన్తో ఇప్పటికే విపరీతమైన ఆసక్తి రేకెత్తించగా, ఈమధ్యే విడుదలైన ఆడియో, ట్రైలర్లతో ఎక్కడికో వెళ్ళిపోయింది. దీంతో ఈ సినిమాకు బిజినెస్ పరంగానూ క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. దిల్రాజు, సాయి కొర్రపాటి లాంటి ప్రముఖ నిర్మాతలు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను కొనుగోలు చేయడం ఈ సినిమాకు మరింతగా కలిసివచ్చింది.
నవంబర్ 20న పెద్ద ఎత్తున ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు సుకుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక సినిమా రిలీజ్కు ఇంకా కేవలం వారం రోజులే ఉండడంతో ‘కుమారి 21 ఎఫ్’ టీమ్ సరికొత్త ప్రచార కార్యక్రమాలను చేపడుతోంది. ప్రమోషన్స్లో భాగంగా రేపు హైద్రాబాద్ నిజాంపేట్లోని శ్రీ చైతన్య కాలేజీలో కుమారి 21 ఎఫ్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ను ఏర్పాటు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే యూత్లో పాపులర్ అయిపోగా రేపు దేవిశ్రీ స్వయంగా ఈ ఈవెంట్లో లైవ్ షో ఇవ్వనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ లైవ్షో కావడంతో ఈ ప్లాటినం డిస్క్ ఫంక్షన్లో దేవీయే హైలైట్ కానున్నారు. రాజ్ తరుణ్, హీబా పాటిల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు.

