ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ ఈ ఏడాది ఇప్పటికే ఒక హిట్ను తన ఖాతాలో వేసుకోగా, ఆయన నుంచి రాబోతున్న ‘బైకర్’, ‘భోగి’ చిత్రాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే శర్వానంద్ ఒక క్రేజీ ప్రాజెక్ట్కు సంతకం చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లతో శర్వానంద్ జతకట్టబోతున్నారు. ఈ చిత్రానికి ‘జార్జ్ కృష్ణ’ అనే ఆసక్తికరమైన టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. 2027 సంక్రాంతి విడుదలే లక్ష్యంగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్కు సంబంధించి మరో తాజా అప్డేట్ ఏమిటంటే.. ఇందులో శర్వానంద్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించే అవకాశం ఉందట. పూజా హెగ్డే ప్రస్తుతం విజయ్ సరసన నటించిన తన భారీ తమిళ చిత్రం ‘జన నాయగన్’ విడుదల కోసం ఎదురుచూస్తోంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే, 2022 తర్వాత పూజా హెగ్డే నటిస్తున్న పూర్తి స్థాయి తెలుగు సినిమా ఇదే అవుతుంది. ఈ ప్రాజెక్ట్పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


