పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. గత కొన్ని నెలలుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన, శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగా ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయన, వైద్యుల సలహా మేరకు తన అధికారిక పర్యటనలు, కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రిలో చేరారు.
ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ గారికి MRI సహా పలు కీలక వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు, సమస్య పరిష్కారానికి శస్త్రచికిత్స అవసరమని నిర్ణయించి శనివారం సాయంత్రం ఆపరేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, శస్త్రచికిత్స విజయవంతమైందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం ఒక అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది.
వైద్యుల సూచనల ప్రకారం, పవన్ కళ్యాణ్ కనీసం పది రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఆయన మళ్ళీ అధికారిక విధుల్లో పాల్గొనే అవకాశం ఉంది. అయితే, పూర్తి స్వస్థత చేకూరడానికి మరికొంత సమయం పడుతుందని, దీర్ఘకాలం పాటు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు స్పష్టం చేశారు. పవన్ ఆరోగ్యంపై అభిమానులు ఆరా తీస్తున్నారు.


