ముఖ్య అంశాలు
- క్వాలిఫైయర్ 2 పోరులో రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 18.4 ఓవర్లలోనే ఛేదించి 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.
- రాజస్థాన్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (96) కేవలం 47 బంతుల్లోనే విధ్వంసం సృష్టించి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.
- గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ (104) వీరోచిత శతకానికి తోడుగా, ఓపెనర్ సాయి సుదర్శన్ (58) హాఫ్ సెంచరీతో చెలరేగి జట్టును ఫైనల్ చేర్చారు.
ఐపీఎల్ 2026 సీజన్ తుది ఘట్టానికి చేరుకుంది. అభిమానుల అంచనాలను నిజం చేస్తూ, క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ సత్తా చాటింది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 215 పరుగుల కొండంత లక్ష్యాన్ని గుజరాత్ బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ వీరోచిత శతకంతో కదం తొక్కడంతో, రాజస్థాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టైటాన్స్ దర్జాగా ఫైనల్కు దూసుకెళ్లింది.
సూర్యవంశీ విధ్వంసం.. ఆదుకున్న జడేజా
మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (1) నిరాశపరిచాడు. అయితే మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గుజరాత్ బౌలర్లను చితకబాదుతూ కేవలం 47 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 96 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మిడిల్ ఆర్డర్లో రవీంద్ర జడేజా (45 నాటౌట్; 35 బంతుల్లో) ఆచితూచి ఆడగా, ఆఖర్లో డొనొవన్ ఫెరీరా సిక్సర్ల వర్షం కురిపించాడు. అతడు కేవలం 11 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, 2 ఫోర్లతో 38 పరుగులు చేయడంతో.. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. గుజరాత్ బౌలర్లలో కాగిసో రబాడా, జేసన్ హోల్డర్ తలో రెండు వికెట్లు తీశారు.
గిల్ క్లాస్ ఇన్నింగ్స్.. గుజరాత్ సూపర్ విక్టరీ
భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్కు ఓపెనర్లు అదిరిపోయే శుభారంభం ఇచ్చారు. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ కలిసి రాజస్థాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. సాయి సుదర్శన్ 32 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్తో 58 పరుగులు చేసి తొలి వికెట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ గిల్ మరింత రెచ్చిపోయాడు. తన మార్క్ క్లాస్ షాట్లతో మైదానాన్ని హోరెత్తించాడు. కేవలం 53 బంతుల్లోనే 15 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 104 పరుగులు చేసి మ్యాచ్ను పూర్తిగా గుజరాత్ చేతుల్లో పెట్టాడు.
గిల్ అవుటైన తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ (16) వేగంగా ఆడే ప్రయత్నంలో పెవిలియన్ చేరాడు. అయితే క్రీజులో ఉన్న జోస్ బట్లర్ (9 నాటౌట్), రాహుల్ తెవాటియా (17 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశారు. తెవాటియా 9 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్తో మెరవడంతో.. గుజరాత్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే, కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 219 పరుగులు చేసి గెలుపు సంబరాల్లో మునిగిపోయింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మ తలో వికెట్ దక్కించుకున్నా ఫలితం లేకపోయింది. ఈ అద్భుత విజయంతో టైటాన్స్ ఫైనల్ సమరానికి సై అంటోంది.


