నార్సింగి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో జానపద కళాకారుడు ఈశ్వర్ సాయికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తోటి జానపద కళాకారిణి మాధురి రాథోడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69తో పాటు ఎస్సీ, ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ ఆయన హైకోర్టులో క్రిమినల్ పిటిషన్ (నం. 14088/2026) దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై ఈశ్వర్ సాయి తరఫున నాగూర్బాబు లా ఫర్మ్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువర్గాల మధ్య సంబంధం పరస్పర అంగీకారంతో కూడుకున్నదని, దీనికి సంబంధించి కస్టోడియల్ విచారణ అవసరం లేదని కోర్టుకు తెలిపారు. దర్యాప్తునకు పిటిషనర్ పూర్తిగా సహకరిస్తారని స్పష్టం చేశారు.
ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన న్యాయస్థానం.. ఈశ్వర్ సాయికి కొన్ని నిర్దిష్ట షరతులతో కూడిన ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. అయితే ఈ ఉపశమనం కేవలం మధ్యంతర రక్షణ మాత్రమేనని, ఆరోపణల నిగ్గు తేల్చేందుకు చట్ట ప్రకారం దర్యాప్తు యథావిధిగా కొనసాగుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.


