బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా సౌత్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్గా నటించిన ‘ఏక్ దిన్’ చిత్రం ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం కేవలం రూ. 5.44 కోట్ల వసూళ్లతో సరిపెట్టుకుంది. ఈ చిత్రాన్ని స్వయంగా అమీర్ ఖాన్ ప్రమోట్ చేసినప్పటికీ, ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించక పోవడం గమనార్హం.
ఈ సినిమా ఫెయిల్యూర్పై జునైద్ స్పందిస్తూ.. తన తండ్రి అమీర్ ఖాన్ ఈ ఫలితం పట్ల తీవ్ర నిరాశలో ఉన్నారని తెలిపాడు. అమీర్ ఏదైనా సినిమాను ఇష్టపడి చేసినప్పుడు, అది విఫలమైతే ఆయన వ్యక్తిగతంగా ఎంతో బాధపడతారని జునైద్ వెల్లడించాడు.
సినిమా ఆడకపోవడంపై జునైద్ స్పందిస్తూ.. ‘మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, కానీ కొన్నిసార్లు ఇలా జరుగుతుంటుంది. ఈ సినిమా నాకు ఎంతో నచ్చింది, కానీ మెజారిటీ ప్రేక్షకులను మెప్పించలేకపోయాం’ అని నిజాయితీగా అంగీకరించాడు. సాయి పల్లవి వంటి స్టార్ ఉన్నా ఈ సినిమా నిలబడలేక పోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
