
ఇప్పుడు ఏ నోట విన్నా, ఏ చోట కన్నా అంతటా ‘బాహుబలి’ ఫీవర్ పట్టేసుకుంది. దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ సినిమా మళయాల వర్షన్ రిలీజ్ విషయంలో మొదట్నుంచీ కొంత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో బాహుబలి మళయాల వర్షన్ అనుకున్నంత స్థాయిలో విడుదల కాలేదనే చెప్పాలి.
మళయాలంలో ఈ మధ్యే విడుదలై బ్లాక్బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ‘ప్రేమమ్’ సినిమా పైరసీ బారిన పడగా, ఆ సినిమాకు అండగా నిలవాలన్న ఆలోచనలో కేరళ ఎగ్జిబిటర్స్ ఫెడరేషన్ వారు నేడు థియేటర్ల బంద్ పాటించనున్నారు. దీంతో కేరళలోని ప్రధాన థియేటర్లలో నేడు బాహుబలి విడుదల ఆగిపోయింది. ప్రస్తుతానికి కొన్ని ప్రధాన మల్టిప్లెక్స్లు, ప్రభుత్వం తరపున నడిచే థియేటర్లలో మాత్రమే బాహుబలి విడుదల కానుందని తెలుస్తోంది.

