అలనాటి నటి, దర్శకురాలు విజయ నిర్మల హఠాన్మరణం సినీ పరిశ్రమను దిగ్బ్రాంతికి గురిచేసింది.
సినీ సెలబ్రిటీలంతా ఆమె మృతి పట్ల సంతాపాన్ని తెలుపుతున్నారు. సీఎం జగన్, చంద్రబాబు నాయుడు లాంటి వారంతా కృష్ణగారి కుటుంబానికి సంతాపం తెలుపగా సినీ హీరో చిరు స్పందిస్తూ ‘తెలుగు సినీ పరిశ్రమలో భానుమతి తర్వాత గర్వించదగిన బహుముఖ ప్రజ్ఞాశాలి విజయ నిర్మల. బాలనటిగా, కథానాయికగా, దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభ చాటారు. అంతటి ప్రతిభావంతురాలిని మనం ఇప్పట్లో ఇంకెవరినీ చూడలేం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కృష్ణ, నరేస్లకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
అలాగే నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ ‘సినీ పరిశ్రమలో మహిళా సాధికారతను చాటిన అతి కొద్ది మంది మహిళల్లో విజయనిర్మల ఒకరు. నాన్నగారి `పాండురంగ మహత్యం` సినిమాలో కృష్ణుడిగా నటించారు. అదే ఆవిడ నటించిన తొలి తెలుగు సినిమా. కథానాయకిగా కూడా ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు. నాన్నగారితో మారిన మనిషి, పెత్తందార్లు, నిండు దంపతులు, విచిత్ర కుటుంబం సినిమాల్లో నటించారు. దర్శకురాలిగా 44 చిత్రాలను డైరెక్ట్ చేసి గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించి ఆదర్శంగా నిలిచారు. ఆమె మృతి చిత్ర పరిశ్రమకు తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అన్నారు.