రజనీకాంత్ హీరోగా 1995లో వచ్చిన ‘భాషా’ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో చెప్పనక్కర్లేదు. తమిళ సినిమాల్లో ఓ క్లాసిక్ గా నిలిచిపోయిన ఈ చిత్రాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో గ్యాంగ్ స్టర్ సినిమాలు రూపొందాయి. ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించాలని ‘మొట్ట శివ కెట్ట శివ’ చిత్ర దర్శకుడు సాయి రమణి గత కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నారు.
స్క్రిప్ట్ తయారుచేసుకుని రజినీకి కూడ వినిపించారట. స్క్రిప్ట్ ను మెచ్చిన రజనీ ‘భాషా’ లాంటి క్లాసిక్ చిత్రాన్ని టచ్ చేయకపోవడమే మంచిదని, తాను కూడ ఇప్పుడు ఆ తరహా సినిమా చేయాలనుకోవడంలేదని నెమ్మదిగా తిరస్కరించారట. అంతేగాక వేరే మంచి లైన్ ఏదైనా ఉంటే కథ తయారుచేయమని సాయి రమణికి చెప్పారట.
దీంతో సాయి రమణి రజనీ సలహా మేరకు కొత్త కథను రాసే పనిలో పడ్డారట. ఇకపోతే రజనీ ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.