సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’ ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్పై అరుణ్ రంగరాజులు నిర్మించిన ఈ చిత్రానికి రామ్ చక్రి దర్శకత్వం వహించారు. ప్రముఖ పంపిణీ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
దర్శకుడు రామ్ చక్రి మాట్లాడుతూ, ఇది మధ్యతరగతి జీవితాల చుట్టూ అల్లుకున్న రియలిస్టిక్ కథ అని, ముఖ్యంగా అప్పుల బాధల్లో ఉన్నవారికి ధైర్యాన్నిచ్చే చిత్రమని పేర్కొన్నారు. సముద్రఖని మధ్యతరగతి భర్తగా, తండ్రిగా అద్భుతంగా నటించారని తెలిపారు. దర్శకులు శేఖర్ కమ్ముల, కె.వి. గుహన్ తనకు స్ఫూర్తి అని ఆయన గుర్తుచేసుకున్నారు.
సంగీత దర్శకుడు రామానుజన్ బృందం ఈ సినిమా కోసం ‘మ్యూజిక్ యాజ్ ఎ సర్వీస్’ అనే వినూత్న కాన్సెప్ట్ తీసుకొచ్చింది. దీని ద్వారా పాటల రూపకల్పనలో పాలుపంచుకున్న ప్రతి సాంకేతిక నిపుణుడికి క్రెడిట్, ఆదాయం దక్కేలా చేస్తున్నారు. అప్పులతో సతమతమయ్యే ప్రతి కుటుంబం ఈ సినిమాకు కనెక్ట్ అవుతుందని, విదేశాల్లో పనిచేసేవారు విధిగా తమ కుటుంబాలతో సమయం గడపాలని ఈ చిత్రం ద్వారా సందేశం ఇస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.
