టాలీవుడ్ లో కామెడీ సినిమాగా తెరకెక్కిన ‘ఎఫ్2’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా అందుకున్న సక్సెస్ తో దీనికి సీక్వెల్ గా ‘ఎఫ్-3’ ని కూడా తెరకెక్కించారు మేకర్స్. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా.. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి.
ఇక ఈ రెండు సినిమాలను దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన కామెడీ ఎంటర్టైన్మెంట్ తో డైరెక్ట్ చేసి మంచి విజయాలను అందుకున్నారు. కాగా, ఈ రెండు సినిమాలు కూడా భారీ విజయాలను అందుకోవడంతో, త్వరలోనే ‘ఎఫ్-4’ మూవీ కూడా పట్టాలెక్కనుందని సినీ వర్గాల్లో వార్తలు వినిపించాయి. అయితే, ఇప్పుడు అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
ప్రస్తుతం వెంకటేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రానా నాయుడు వెబ్ సిరిస్ సీక్వెల్స్ లో నటిస్తున్న వెంకీ, ఆ తరువాత అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి 2025 కానుకగా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే అనౌన్స్ కూడా చేశారు. అటు అనిల్ రావిపూడి కూడా తన నెక్ట్స్ కమిట్మెంట్లతో బిజీగా ఉన్నాడు. దీంతో వీరిద్దరు తమ ప్రాజెక్టులన్నీ పూర్తి చేశాకే ‘ఎఫ్-4’ మూవీ గురించిన ప్రకటన వస్తుంది. అంటే, ఇప్పట్లో ‘ఎఫ్-4’ మూవీ పట్టాలెక్కడం కష్టమనే చెప్పాలి.