పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి జీహెచ్ఎంసీ ఎన్నికల పనుల్లో ఉన్న సంగతి తెలిసిందే. రెండు మూడు రోజుల క్రితం మంగళగిరి వెళ్లిన ఆయన అభిమానులు, కార్యకర్తలతో సమావేశమై వారి కోరిక మేరకు గ్రేటర్ ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు ప్రకటించారు. అభ్యర్థులంతా నామినేషన్లు వేయాలని కోరారు. దీంతో హైదరాబాద్ నగరంలో ఉన్న పవన్ అభిమానులు అలర్ట్ అయ్యారు. ఎన్నికల పనుల్లో నిమగ్నమయ్యారు. కొందరు నామినేషన్లు కూడ వేశారు.
కానీ ఈరోజు ఉన్నట్టుండి ఆ నామినేషన్లను ఉపసంహరించుకోమని పవన్ తెలపడంతో అందరూ షాకయ్యారు. బీజేపీ నేతలతో సమావేశమైన ఆయన ఎన్నికల నుండి వైదొలుగుతున్నామని, భాజాపాకు మద్దతిస్తున్నామని అంటూ రెండు పార్టీలు కలిసి పోటీచేయాలని అనుకున్నా కరోనా పరిస్థితులు వలన కుదరలేదు, ఎన్నికల్లో బీజేపీ గెలవాల్సిన అవసరం ఉంది, ఒక్క ఓటు కూడ బయటకు పోకుండా ఉండాలనే పోటీని విరమించుకుంటున్నాం అని చెప్పుకొచ్చారు. అలాగే బీజేపీకి సంపూర్ణ మద్దతివ్వాలని సూచించారు. పవన్ ఇలా ఉన్నపళంగా పోటీ నుండి తప్పుకోవాలని కోరడంతో చాలామంది ఫ్యాన్స్ నీరుగారిపోయారు.