డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘పూరీ మ్యూజింగ్స్’ అంటూ మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేసే క్రమంలో మరో సరికొత్త టాపిక్ తో వచ్చారు. టాపిక్ పేరు ‘ఫ్యూచర్ ఎడ్యుకేషన్’. మరి పూరి మాటల్లోనే ‘ఫ్యూచర్ ఎడ్యుకేషన్’ గురించి విందాం. పూరి మాటల్లో..‘‘నేటి మోడ్రన్ స్కూళ్లు పిల్లలకు అపారమైన జ్ఞానాన్ని అందిస్తున్నాయి. అయితే ఆ నాలెడ్జ్ విద్యార్థులను బలమైన వ్యక్తులుగా (మానసికంగా) తయారు చేసేందుకు ఉపయోగపడదు. ఇంటి పనులు ఎలా చేసుకోవాలన్నది ఎల్కేజీ నుంచే నేర్పాలి. శుభ్రత గురించి చెప్పాలి. ఐదేళ్లకే సమయపాలన, నిజాయతీ అంటే ఏంటో వివరించాలి. ప్రతి విద్యార్థికీ క్రమశిక్షణను నూరిపోయాలి. కుకింగ్ క్లాసెస్ కూడా ఉండాలి. వ్యాయామం, ఆటలు తప్పనిసరి చేయాలి. డిజిటల్ డిసిప్లిన్ గురించి చెప్పాలి’ అని పూరి జగన్నాథ్ తెలిపారు.
పూరి జగన్నాథ్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఇప్పటి స్కూళ్లన్నీ పరీక్షలు, మార్కులు, కంఠస్తం చేయడంపై దృష్టి పెడుతున్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ కన్నా ముందు సెల్ఫ్ కంట్రోల్, టైమ్ మేనేజ్మెంట్, ఎమోషనల్ బ్యాలెన్స్ లాంటి వాటిపై పాఠాలుండాలి. ఇవే వారికి జీవితంలో ఉపయోగపడతాయి. కమ్యూనికేషన్ ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. కనీసం మూడు భాషలు మాట్లాడేలా చూడాలి. మెంటల్ హెల్త్పై అవగాహన కలిగించేలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రకృతిని ఎలా కాపాడుకోవాలన్నది చెప్పాలి. వీటి తర్వాతే మిగిలిన సబ్జెక్టులుండాలి’ అని చెప్పుకొచ్చారు.
