
తెలుగు, తమిళ, మళయాల, హిందీ ఇలా దేశంలోని ప్రధాన సినీ పరిశ్రమల్లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి గౌతమి. గతంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్ 1998 తర్వాత తెరపై మళ్ళీ కనిపించలేదు. తాజాగా మళయాలం, తెలుగులో సూపర్ హిట్ అయిన దృశ్యం సినిమా తమిళ రీమేక్లో గౌతమి నటించారు. కమల్ హాసన్ హీరోగా జీతూ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా విడుదలకు దగ్గరైన సందర్భంగా పాపనాశనం విశేషాలను తెలియజేస్తూ.. చాలా కాలం తర్వాత తెరపై కనిపించనున్న గౌతమి ఈ సినిమా ద్వారా సరైన రీ ఎంట్రీ ఇవ్వనుందని కమల్ హాసన్ అన్నారు. గౌతమి ఈ సినిమాలో మంచి నటనను కనబరిచిందని సమాచారం. ఇక 2005నుంచీ కమల్, గౌతమి ఇద్దరూ సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే! కాగా కమల్ గత చిత్రం ఉత్తమ విలన్ మంచి రివ్యూస్ సంపాదించుకున్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఫెయిలయింది. పాపనాశనం బాక్సాఫీస్ పరంగానూ మంచి విజయం సాధిస్తుందని కమల్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

