దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘రాజ్ దూత్’. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు గా, లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై అర్జున్ – కార్తీక్ దర్శకత్వంలో ఎమ్.ఎల్.వి సత్యనారాయణ నిర్మించారు. ఈ చిత్రం పోస్ట్ప్రొడక్షన్ పనులు ముగించుకుని జూలై5న విడుదలకు సిద్ధమవుతోంది.
ఇటీవల విడుదలైన టీజర్ కి అనూహ్య స్పందన వచ్చింది, రియల్ స్టార్ వారసుడిగా మేఘాంశ్ కి హీరోకి కలవాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి. హీరోయిజానికి సరిపడే ఛామింగ్ డ్యాషింగ్ లుక్ అతడికి ఉంది.మేఘాంశ్ తెలుగు తెరపై హీరోగా సంచలనాలు సృష్టించడం ఖాయం అన్నారు నిర్మాత చిట్టిబాబు.
హీరో మేఘాంశ్ తల్లి శాంతి శ్రీహరి మాట్లాడుతూ తన తండ్రి శ్రీహరి ఆశీసులతో పాటు తెలుగు ప్రేక్షకుల ప్రేమ కచ్చితంగా మేఘాంశ్ పై ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మీడియా శ్రీహరిని ఓ కుటుంబ సభ్యుడిగా భావించి తమ సహకారం అందించారని, అలాగే మేఘాంశ్ కి కూడా వారి అండదండలు ఉంటాయని భావిస్తున్నారు అన్నారు.
దర్శకులు అర్జున్ – కార్తీక్ మాట్లాడుతూ.. మేఘాంశ్కు తొలి చిత్రమైనా ఆయనకు సరిపడే కథాంశంతో రూపొందించాం. తను చేసిన యాక్షన్ సన్నివేశాలు చిత్రానికి హైలైట్గా నిలుస్తాయి. యువతకు దగ్గరయ్యేట్లు అతని పెర్ఫార్నెన్స్ వుంటుందని పేర్కొన్నారు.
ఈ చిత్రంలో సుదర్శన్, కోటశ్రీనివాసరావు, ఆదిత్యమీనన్, ఏడిద శ్రీరామ్, దేవిప్రసాద్, అనిష్ కురివిళ్ళ, మనోబాల, వేణుగోపాల్, దువ్వాసి మోహన్, సూర్య, రవివర్మ, చిత్రం శ్రీను, వేణు తదితరులు ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ మూవీకి సంగీతం వరుణ్ సునీల్ అందించారు.