
‘స్వామిరారా’ సినిమాతో తెలుగులో క్రైమ్ కామెడీ సినిమాలకు ఒక కొత్త దారిని ఏర్పరచిన దర్శకుడు సుధీర్ వర్మ. తాజాగా సుధీర్ వర్మ నాగచైతన్యతో ‘దోచేయ్’ పేరుతో మరో సరికొత్త కథాంశంతో సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ నిన్న(ఏప్రిల్ 10న) జరిగింది. ఈ సందర్భంగా సినిమా పాటలతో పాటు థియేట్రికల్ ట్రైలర్ను కూడా విడుదల చేశారు.
ఇక ఈ థియేట్రికల్ ట్రైలర్ చూసిన వారినుండి అద్భుతమైన స్పందన వస్తోంది. సుధీర్ వర్మ మళ్ళీ తన మ్యాజిక్ను రిపీట్ చేశాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్రైలర్ ద్వారా ఈ సినిమా క్రైమ్, కామెడీ, లవ్స్టోరీ ప్రధానంగా సాగుతుందని తెలుస్తోంది. ప్రొడక్షన్స్ వ్యాల్యూస్ అద్భుతంగా ఉన్నాయన్న విషయం ట్రైలర్ ద్వారానే వ్యక్తమవుతోంది. ఇక పీటర్ హెయిన్ సారథ్యంలో తెరకెక్కిన యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి.
నాగచైతన్య తన గత చిత్రాలకు కాస్త భిన్నంగా మంచి టైమింగ్తో ఆకట్టుకుంటున్నాడు. ఇక డైలాగులు మరో ప్రధాన ఆకర్షణ అన్న విషయం అర్థమవుతూనే ఉంది. ఓవరాల్గా చూస్తే దోచేయ్ ట్రైలర్ ఇటు అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకులనూ అలరించేలా ఉంది. ఈ ట్రైలర్తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరుగుతాయనే విషయంలో సందేహం లేదు. మరి ఆ అంచనాలను సినిమా అందుకుంటుందా? అనేది తెలియాలంటే ఏప్రిల్ 24వరకూ ఆగాల్సిందే!
దోచేయ్ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

