పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక సినిమాలకు పుల్ స్టాప్ పెట్టేస్తారా..? ‘జనసేన’ పార్టీ స్థాపించి క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించిన తరుణంలో ప్రముఖంగా వినిపించిన ప్రశ్న ఇది. పవన్ కూడా ప్రస్తుతం అంగీకరించిన సినిమాలు పూర్తయిన తర్వాత రాజకీయాలకు అంకితం అవుతానని ప్రకటించారు. రాజకీయాలలోకి వెళ్ళినా పవన్ సినిమాలలో కొనసాగాలని అభిమానులు కోరుకున్నారు. వారి కోరిక నెరవేరింది. ‘గోపాల గోపాల’ ఆడియోలో పవన్ స్వరం మారింది, గతంలో తీసుకున్న నిర్ణయంలో మార్పు కనిపించింది.
నాకు ఊహ తెలిసిన సమయం నుండి ఇప్పటివరకూ భగవంతుడిని ఏమి అడగలేదు, ఎ దేవుడి వద్ద ఎ ఒక్క కోరిక కోరుకోలేదు. మొదటిసారి అభిమానుల కోసం ఒక్క కోరిక కోరుకున్నాను. నన్ను ఎంతగానో అభిమానించి, ప్రేమించే వారి కోసం ఒక్క విజయం ఇవ్వు తండ్రి ఇండస్ట్రీని వదలి వెళ్ళిపోతానని కోరుకున్నాను. అని ‘గోపాల గోపాల’ ఆడియోలో పవన్ వ్యాఖ్యానించగా.. అభిమానులు పెద్ద ఎత్తున ‘నో నో.. మీరు సినిమాలు చేయాలి అని అరిచారు. బదులుగా పవన్ కళ్యాణ్… ‘అలా కోరుకున్నాను అంతే, భగవంతుడు ఎప్పుడు వదలితే అప్పుడే. అప్పటివరకూ సినిమాల్లోనే.’ అని అనడంతో పవర్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
‘గోపాల గోపాల’ తర్వాత పవన్ కళ్యాణ్, ‘గబ్బర్ సింగ్ 2’ సినిమా ప్రారంభించనున్నారు. తర్వాత డాలీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని మాటిచ్చారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘కోబలి’ అనే పేరుతో ఓ సినిమా చేయడానికి గతంలో సన్నాహాలు జరిగాయి. ‘అత్తారింటికి దారేది’ తర్వాత మరోసారి వీరిద్దరి కలయికలో సినిమా ఉంటుందని భావించవచ్చు.


