
ఒకప్పటి అగ్ర హీరోయిన్, ప్రస్తుతం తెలుగు సినిమాలలో తల్లి పాత్రలకు కేరాఫ్ అడ్రస్స్ గా మారిన జయసుధ కుమారుడు త్వరలో హీరోగా తెరంగేట్రం చేయనున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారం. జయసుధకు ఇద్దరు కుమారులు, వారిలో చిన్నవాడు శ్రేయన్ కపూర్ హీరోగా పరిచయం కానున్నారు. కొన్ని రోజుల నుండి జయసుధ కుటుంబ సభ్యులు పలు కథలను విన్నారు. వాటిలో వాసు మంతెన అనే కొత్త కుర్రాడు చెప్పిన కథ బాగా నచ్చిందట.
శ్రేయన్ తొలి సినిమాకు దర్శకుడిగా వాసు మంతెన ఎంపిక దాదాపు ఖాయమే. ఈ సినిమాను దర్శకుడు స్వయంగా నిర్మించనున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ వాసి అయిన వాసు మంతెనకు నగరంలో విద్యా సంస్థలు ఉన్నాయి. హీరోయిన్, ఇతర టెక్నీషియన్ల ఎంపిక త్వరలో మొదలు పెడతారు. ఈ సినిమా వివరాలను కూడా త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.