సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ మన దేశంలో తొలి తీవ్రవాది నాథురాం గాడ్సే అని, అతనొక హిందువుని వ్యాఖ్యలు చేసి పెను దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. అరవకుచ్చి నియోజకవర్గంలో జరిగిన రోడ్ షోలో కమల్ ఈ మాటలు మాట్లాడారు. ఆ వ్యాఖ్యలతో నొచ్చుకున్న ఒక హిందూ సంస్థ మతపరమైన వ్యాఖ్యలతో విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆయనపై పోలీసులకు పిర్యాదు చేసింది. పోలీసులు కూడా రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు.
దీంతో కమల్ ముందు జాగ్రత్తగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. హైకోర్టు మధురై ధర్మాసనం కమల్ హాసన్కు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ వలన ఆయనకు కేసులో కొంచెం ఊరట కలిగినట్టైంది. ప్రస్తుతం పార్టీ పనుల్లో బిజీగా ఉన్న కమల్ త్వరలోనే శంకర్ డైరెక్షన్లో ‘ఇండియన్ 2’ చేసి ఆ తర్వాత 1992లో చేసిన హిట్ సినిమా ‘తేవర్ మగన్’కు సీక్వెల్ స్టార్ట్ చేస్తారు.