
ప్రయోగాలకు పెట్టింది పేరైన నటుడు కమల్ హాసన్ ‘చీకటి రాజ్యం’ పేరుతో తాజాగా మరో కొత్త ప్రయత్నం చేస్తోన్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ వర్షన్ తూంగవనంకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక తాజాగా ఈ ఉదయం తెలుగు వర్షన్ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు చీకటి రాజ్యం సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఒకే ఒక్క రాత్రి జరిగే సంఘటనల నేపథ్యంలో థ్రిల్లింగ్ స్క్రీన్ప్లేతో ఈ సినిమా తెరకెక్కనుంది.
కమల్ శిష్యుడు రాజేష్ ఎమ్. సెల్వ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమాను కమల్ స్వయంగా నిర్మించారు. దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. తమిళ వర్షన్ ‘తూంగవనం’ నవంబర్ 10నే విడుదల కానుండగా, తెలుగు వర్షన్ చీకటి రాజ్యం మాత్రం రెండు రోజులు ఆలస్యంగా అంటే నవంబర్ 12న విడుదల కానుంది. త్రిష, ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా ఇప్పటికే వేగవంతం అయ్యాయి. రేపు తెలుగు వర్షన్ ఆడియో రిలీజ్ను హైద్రాబాద్లో ప్లాన్ చేశారు. కమల్ హాసన్తో పాటు ఇతర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.