కరోనా వ్యాప్తిని అరికట్టే నేపధ్యంలో ప్రభుత్వాలు దాదాపు రెండు నెలలుగా లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక, తినడానికి తిండి లేక వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఈ తరుణంలో వారంతా కాలినడకనే స్వస్థలాలకు బయలుదేరారు. మండుటెండల్లో వేల కొద్ది కిలోమీటర్లు నడుస్తూ కొందరు ప్రాణాలు విడుస్తున్నారు.
అయితే వలస కూలీల ఇబ్బందులను తెలుసుకుని వారిని ఆదుకోవడానికి హీరో మంచు మనోజ్ ముందుకొచ్చారు. నేడు తన బర్త్డేను పురస్కరించుకొని హైదరాబాద్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను తన సొంత ఖర్చుతో సొంత ఊళ్ళకు తరలిస్తున్నారు. హైదరాబాద్లోని మూసాపేట నుంచి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు వలస కార్మికులను నేడు రెండు బస్సుల్లో వారి స్వస్థలాలకు పంపించారు. వారందరికి అవసరమైన ఆహారంతో పాటు మాస్క్లు, శానిటైజర్స్ను కూడా మంచు మనోజ్ అందజేశారు. అయితే రేపటి నుంచి మరింత మందిని వలస కార్మికులను హైదరాబాద్ నుంచి వారి స్వంత గ్రామాలకు బస్సుల్లో పంపేందుకు మనోజ్ ఏర్పాట్లు చేస్తున్నారు.