
గత కొన్నాళ్ళ క్రితం వరకూ తనదైన సినిమా చేయలేకపోయిన మణిరత్నం, ‘ఓకే బంగారం’ (తమిళంలో ఓకే కన్మణి)తో మళ్ళీ తన మ్యాజిక్ను రిపీట్ చేశారు. మణిరత్నం ఈజ్ బ్యాక్ అన్న స్లోగన్తో ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించింది. సహ జీవనం నేపథ్యంలో మణిరత్నం తనదైన స్టైల్లో రూపొందించిన ఈ సినిమా కాన్సెప్ట్పై సినిమా విడుదలప్పుడు పలు చర్చలు కూడా జరిగాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి తెలిసింది.
ప్రఖ్యాత భుసన్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఓకే కన్మణి సినిమాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ‘విండో టు ఏషియన్ సినిమా’ క్యాటగిరీలో ఓకే కన్మణి ఈ ఫెస్టివల్లో ప్రదర్శితం కానుందని సమాచారం. దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఏ.ఆర్.రహమాన్ మ్యూజిక్ ఓ హైలైట్గా నిలిచింది. ఇటు విమర్శకుల ప్రశంసలు, అటు బాక్సాఫీస్ కలెక్షన్స్ రెండింటినీ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఫిల్మ్ ఫెస్టివల్స్కు కూడా ఎంపికవ్వడం విశేషం.

