పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ “ఆదిపురుష్”. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్టు ఈ రోజు ఉదయం చిత్ర బృందం తెలిపింది. వాస్తవానికి ఈ ఏడాది ఆగస్ట్ 11న ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ తొలుత అనుకున్నారు.. కానీ అదే రోజున అమీర్ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ విడుదల కాబోతుండటంతో ‘ఆదిపురుష్’ విడుదల తేదిని మార్చేశారు.
అయితే ఒకటి, రెండు వారాల తేడాతో ఆదిపురుష్ని విడుదల చేస్తారని ప్రభాస్ అభిమానులంతా అనుకున్నారు. కానీ ఏకంగా ఐదు నెలలు ఈ చిత్రాన్ని వెనక్కి పంపడం వెనుక ఓంరౌత్ సెంటిమెంట్ ఉందని అంటున్నారు. ఓంరౌత్కి “ఆదిపురుష్” మూడో చిత్రం. ఓంరౌత్ తన తొలి చిత్రాన్ని స్వాతంత్ర సమరయోథుడు లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ జీవిత గాథ ఆధారంగా ‘లోకమాన్య’ పేరుతో మరాఠీలో రూపొందించాడు. 2015 జనవరి 2వ తేదిన విడుదలైన ఈ చిత్రం అతనికి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక రెండో సినిమాను అజయ్ దేవ్గన్తో ‘తానాజీ’ని తెరకెక్కించాడు. 2020 జనవరి 10వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఓంరౌత్కి దేశవ్యాప్తంగా పేరును తెచ్చిపెట్టింది.
అయితే సంక్రాంతి సీజన్ కలిసొస్తుండడంతో పాటు, ఓంరౌత్ తెరకెక్కించిన మొదటి రెండు సినిమాలు కూడా జనవరిలోనే విడుదల కావడంతో సెంటిమెంట్గా భావించి ఈ డేట్ని చిత్ర బృందం లాక్ చేసిందని సినీవర్గాలు చెప్పుకుంటున్నారు.