అర్జున్ అంబటి, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘పరమపద సోపానం’. నాగ శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మంగళవారం ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, వీర శంకర్, సముద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కొత్తవారితో తెరకెక్కించిన ఈ చిత్రం ఘన విజయం సాధించి, చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అచ్చ తెలుగు టైటిల్తో వస్తున్న ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తుందని సముద్ర, వీర శంకర్ పేర్కొన్నారు. లెజెండరీ దర్శకులు తమ వేడుకకు అతిథులుగా రావడం ఎంతో ఆనందంగా ఉందని హీరో అర్జున్ అంబటి సంతోషం వ్యక్తం చేశారు.
గణపర్తి శ్వేత సమర్పణలో, స్వయంభూ క్రియేషన్స్ బ్యానర్పై గణపర్తి నారాయణరావు, తేలప్రోలు ప్రసన్న ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవ్ జాండ్ సంగీతం అందించగా, ఈశ్వర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. థ్రిల్లర్ అంశాలతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది.


