ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు సమర్పణలో రూపొందిన యూత్ఫుల్ స్పోర్ట్స్ డ్రామా ‘పతంగ్’. ప్రణీత్ పత్తిపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సినిమాటిక్ ఎలిమెంట్స్, రిషన్ సినిమాస్, మాన్సూన్ టేల్స్ బ్యానర్లపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మకా, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించారు. క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి ఆదరణ పొందుతోంది. శనివారం హైదరాబాద్లో జరిగిన చిత్ర సక్సెస్ మీట్లో నిర్మాత ఎస్కేఎన్, హీరో సందీప్ కిషన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ.. “ఈ మధ్య కాలంలో వచ్చిన బ్యూటిఫుల్ సినిమాల్లో ‘పతంగ్’ ఒకటి. ఇందులో నిర్మాతల ప్యాషన్ కనిపిస్తోంది. కైట్ కాంపిటీషన్ సీన్స్ సంక్రాంతిని గుర్తుచేశాయి. ఇలాంటి మంచి చిత్రాన్ని ఎంకరేజ్ చేసేందుకు ఒక మల్టీప్లెక్స్ స్క్రీన్ బుక్ చేసి నా ఫ్రెండ్స్, సోషల్ మీడియా ఫాలోవర్లకు ఉచితంగా చూపిస్తా” అని ప్రకటించారు.
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “ట్రైలర్ చూడగానే సినిమాపై నమ్మకం కలిగింది. ఈ క్రిస్మస్ రేసులో ‘పతంగ్’ పాయసంలా తీపిని అందించే సినిమా. నా వంతు సపోర్ట్గా ప్రేక్షకులకు 500 టిక్కెట్లు స్పాన్సర్ చేస్తా” అని తెలిపారు. ఇండియాలో పతంగుల పోటీ నేపథ్యంలో వచ్చిన తొలి చిత్రమిదని, జనవరి 1న ఓవర్సీస్లో విడుదల చేస్తున్నామని చిత్ర బృందం పేర్కొంది.



