
అందరికి నా హృదయ పూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ పండగ రోజున గోపాలుడు ట్విట్టర్లో ప్రత్యక్షం అయ్యాడు. జనవరి 1న ట్విట్టర్ ఖాతా తెరచిన పవన్… ఇలా అభిమానులకు శుభాకాంక్షలు తెలపడం ఇది రెండోసారి. మధ్యలో ‘గోపాల గోపాల’ ఆడియో వేడుక వద్ద గాయపడిన అభిమాని విషాదాన్ని ప్రస్తావిస్తూ.. మీ క్షేమమే నాకు ముఖ్యం అంటూ ట్వీట్ చేశారు.
ఈ రోజు సేంద్రియ పద్దతులలో నయా పైసా ఖర్చు(జీరో బడ్జెట్) లేకుండా సుభాష్ పాలేకర్ సూచించిన పద్దతులలో తన వ్యవసాయ క్షేత్రంలో కాయగూరలను సాగుచేసిన వైనాన్ని ట్విట్టర్ లో తెలిపారు. సహజ పద్దతులలో వ్యవసాయం ఎంతో ఉపయోగకరం అనే సందేశాన్ని ఇచ్చారు. రైతు కన్నీరు పెట్టని గ్రామీణ భారతం రావాలని ఆశిస్తూ.. సెలవు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో అప్పుల భాధతో రైతు ఆత్మహత్య అనే వార్త ప్రతిరోజూ.. ప్రజలు ఎక్కడో ఒక చోట వింటున్నారు. ఈ నేపధ్యంలో పవన్ చెప్పిన జీరో బడ్జెట్ అగ్రికల్చర్ మెథడ్ సామాన్యుల దృష్టిని ఆకర్షించింది.
సంక్రాంతి కానుకగా విడుదలైన ‘గోపాల గోపాల’ సినిమా విజయపథంలో దూసుకుపోతుంది. ఈ సినిమాలో పవన్ మోడరన్ శ్రీకృష్ణుడిగా నటించారు. ఈ సినిమా గురించి పవన్ ట్విట్టర్లో ప్రస్తావించకపోవడం గమనార్హం.