
ఎనర్జిటిక్ హీరో రామ్ చేస్తోన్న తాజా సినిమా ‘పండగ చేస్కో’ విడుదలకు సిద్ధమౌతోంది. రెండు వరుస అపజయాల తర్వాత ఎలాగైనా హిట్ కొట్టి తీరాలన్న సంకల్పంతో ఉన్న రామ్, ‘బలుపు’ లాంటి మంచి హిట్ ఇచ్చిన గోపిచంద్ మలినేనితో ‘పండగ చేస్కో’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కూడా ఈ మధ్యే జరిగింది.
థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోకు మంచి స్పందనే వచ్చింది. ముఖ్యంగా ‘యూ మై డార్లింగ్’ అనే పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఆడియో రిలీజ్ రోజునే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఔట్ అండ్ ఔడ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి.
మే మూడో వారంలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. అందుకనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇదే విషయాన్ని చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని తెలియజేస్తూ.. “ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల కానుంది” అని అన్నారు. రామ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహన్లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను పరుచూరి కిరీటి నిర్మించారు.

