మొత్తానికి ప్రభాస్ గ్యాప్ కూడా తీసుకోకుండా ‘సాహో’తో పాటు, ఇటు రాధాకృష్ణ సినిమాను కూడా శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. `జిల్` చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాధాకృష్ణ ఈ సారి ప్రభాస్ హీరోగా ఓ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే యూరప్ లో కొన్ని కీలక సన్నివేశాలను షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఇప్పుడు హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ను ప్రారంభించబోతుంది.
అన్నపూర్ణ స్టూడియోస్ లో గురువారం నుంచి ఈ సినిమా షూటింగ్ ను మొదలపెట్టనున్నారు. సుమారు 16 రోజుల పాటు అన్నపూర్ణ స్టూడియోస్ లోనే షూటింగ్ జరగనుంది. ఈ షూట్ లో ప్రభాస్ తో పాటు హీరోయిన్ పూజా హెగ్డే అలాగే ఇతర కీలక నటీనటులు కూడా పాల్గొనబోతున్నారు.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. పక్కా ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రం 1960 కాలం నాటి నేపథ్యంలో సాగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇక మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.