30 రోజుల గ్యాప్‌లోనే.. 3 పెద్ద సినిమాలు: టాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్‌లో మమితా బైజు సెన్సేషనల్ రికార్డ్!

 ముఖ్య అంశాలు

  • ‘ప్రేమలు’, ‘డ్యూడ్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన యంగ్ బ్యూటీ మమితా బైజు బాక్సాఫీస్ వద్ద అరుదైన మైలురాయిని అందుకోబోతోంది.
  • జూలై 23 నుంచి ఆగస్టు 21 మధ్య కేవలం 30 రోజుల వ్యవధిలోనే ఆమె నటించిన మూడు వేర్వేరు భాషల చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి.
  • కోలీవుడ్ స్టార్ విజయ్ ‘జననాయగన్’, సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, నివిన్ పాలీల క్రేజీ ప్రాజెక్ట్స్‌తో మమితా సౌత్ బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమైంది.

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక యంగ్ హీరోయిన్ పేరు గట్టిగా మార్మోగిపోతోంది. బ్లాక్‌బస్టర్ హిట్ ‘ప్రేమలు’ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌డమ్ సొంతం చేసుకుని, ఆ తర్వాత ‘డ్యూడ్’ మూవీతో తెలుగు ఆడియన్స్‌కు మరింత కనెక్ట్ అయిన క్రేజీ బ్యూటీ మమితా బైజు. తన క్యూట్ లుక్స్, బబ్లీ యాక్టింగ్‌తో కుర్రకారు మనసులు దోచుకున్న ఈ కేరళ కుట్టి.. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్ అనే తేడా లేకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒకేసారి షేక్ చేయడానికి రెడీ అయింది. కేవలం 30 రోజుల వ్యవధిలోనే మూడు వేర్వేరు భాషల్లో, మూడు భారీ చిత్రాలతో థియేటర్లలోకి వస్తూ ఒక రేర్ రికార్డును తన ఖాతాలో వేసుకోబోతోంది. ఈ క్రేజీ లైనప్ మమితా రేంజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

జన నాయగన్

ఈ సెన్సేషనల్ లైనప్‌లో మొదటిగా తమిళ చిత్రం ప్రేక్షకులను పలకరించనుంది. కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జననాయగన్’. హెచ్. వినోద్ దర్శకత్వంలో ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా జూలై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో మమితా బైజు ఒక కీలకమైన పాత్ర పోషించింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను తెలుగులో ‘జననాయకుడు’ పేరుతో భారీగా రిలీజ్ చేస్తుండటంతో, ఇటు టాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ సరసన స్క్రీన్ షేర్ చేసుకోవడం మమితా కెరీర్‌కు మైలేజ్ ఇచ్చే అంశమే.

విశ్వనాథ్ అండ్ సన్స్

ఇక ఇదే ఊపులో టాలీవుడ్ బాక్సాఫీస్‌పై కూడా జెండా పాతేందుకు సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ హిట్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 14న తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఇక్కడి ప్రేక్షకులకు బాగా నచ్చేసిన మమితాకు, ఈ బైలింగ్వల్ మూవీ టాలీవుడ్‌లో గట్టి బ్రేక్ ఇస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

బెత్లెహెం కుడుంబా యూనిట్

ఈ రెండు భారీ చిత్రాల హడావుడి ముగియక ముందే, తన సొంత ఇండస్ట్రీ అయిన మలయాళంలోనూ సందడి చేయనుంది మమితా. యంగ్ స్టార్ నివిన్ పాలీ హీరోగా, ప్రతిష్టాత్మక భావనా స్టూడియోస్ బ్యానర్‌పై వస్తున్న సరికొత్త రోమ్-కామ్ ఎంటర్‌టైనర్ ‘బెత్లెహెం కుడుంబా యూనిట్ ’. ‘ప్రేమలు’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ గిరీష్ ఏడీ రూపొందిస్తున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ఆగస్టు 21న విడుదల కాబోతోంది. తన హోమ్ పిచ్‌పై సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌తో వస్తున్న ఈ సినిమాపై కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.

ఇలా కేవలం 30 రోజుల గ్యాప్‌లోనే తమిళ్, తెలుగు, మలయాళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్‌లతో మమితా బైజు సృష్టిస్తున్న ఈ రికార్డ్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలు కనుక బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధిస్తే, సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ టాప్ లీగ్ హీరోయిన్‌గా మమితా సెటిల్ అయిపోవడం ఖాయం.

Exit mobile version