
తెలుగులో స్టార్ హీరోయిన్ క్రేజ్ ఉండగానే బాలీవుడ్ బాట పట్టింది రకుల్ ప్రీత్ సింగ్. అక్కడ ఆమెకు తరచుగా అవకాశాలు వస్తున్నాయి. 2019లో అజయ్ దేవగన్ హీరోగా రూపొందిన ‘దే దే ప్యార్’ డే సినిమాతో మంచి హిట్ అందుకుంది రకుల్. ఆ తర్వాత ‘మార్జవాన్’ సినిమా చేసింది. ఇక గతేడాది బాలీవుడ్ పరిశ్రమలో సంచలనం రేపిన మాదకద్రవ్యాల కేసులో రకుల్ పేరు గట్టిగానే వినబడింది. కానీ ఆ తర్వాత ఆమెకు వాటితో ఎలాంటి సంబంధం లేదని తేలింది. ఈ వివాదంతో రకుల్ కు హిందీలో అవకాశాలు తగ్గుతాయని అంతా అనుకున్నారు.
కానీ అనూహ్యంగా ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. అవి కూడ భారీ అవకాశాలే. అజయ్ దేవగన్ ఆమెను వరుసగా తన సినిమాల్లోకి తీసుకుంటున్నారు. అజయ్ దేవగన్ నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ‘మే డే’ సినిమాలో నటిస్తున్న రకుల్ కొత్తగా ఇంద్రకుమార్ దర్సకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్న ‘థాంక్ గాడ్’ చిత్రంలో కూడ ఛాన్స్ దక్కించుకుంది. అంటే రెండేళ్లలో అజయ్ దేవగన్ సరసన ఆమె చేస్తున్న మూడవ సినిమా ఇది. ఇవి కాకుండా తెలుగులో క్రిష్ దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా చేస్తున్న సినిమాలో, నితిన్, చంద్రశేఖర్ ఏలేటిల ‘చెక్’ చిత్రంలో నటిస్తోంది రకుల్.

