తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ శకం ముగిసింది. శతాధిక చిత్రాల నిర్మాత, మూవీ మొఘల్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డా. దగ్గుబాటి రామానాయుడు భుదవారం నాడు కన్నుమూశారు. నాయుడు గారి మరణంతో తెలుగు చిత్రసీమ శోక సంద్రంలో మునిగిపోయింది. 24 మంది దర్శకులను, ఎందరో నటీనటులను, సంగీత దర్శకులను చిత్రసీమకు పరిచయం చేసిన ఘనత రామానాయుడు సొంతం. పలువురి కలలను సాకారం చేసిన రామానాయుడు గారి సొంత కోరిక మాత్రం కలగానే మిగిలిపోయింది.
కుమారుడు వెంకటేష్, మనవళ్ళు దగ్గుబాటి రానా, అక్కినేని నాగ చైతన్యలతో కలిసి ఓ సినిమాలో నటించాలనే కోరిక గత కొంత కాలంగా ఆయన మనసులో ఉంది. పలు సందర్భాలలో మీడియా ముందు వ్యక్తపరిచారు. మంచి కథ కోసం రచయితలను సంప్రదించారు. చివరికి దగ్గుబాటి కుటుంబం సినిమా కలగానే మిగిలింది. అలాగే ఓ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే తానె స్వయంగా సమకూర్చి దర్శకత్వం వహించాలని ఆశపడేవారు. ఆ చిరకాల కోరిక సైతం కలగానే మిగిలింది.
భౌతికంగా రామానాయుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినా… ఆయన నిర్మించిన సినిమాలు ఎప్పటికి ప్రేక్షకుల మనస్సుల్లో నిలిచి ఉంటాయి. ఆయన చూపిన దారిలో చిత్ర పరిశ్రమ పయనిస్తూ ఉంటుంది.


