
‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వర్సెస్ సూర్య’.. లాంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత నిఖిల్ నటించిన మరో సరికొత్త కథాంశంతో నడిచే సినిమా శంకరాభరణం విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ, మాటలు అందించడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరిస్తూ చేసిన సినిమా కావడంతో శంకరాభరణం సినిమాకు మొదట్నుంచీ మంచి క్రేజ్ కనిపించింది. బాలీవుడ్ సినిమా పస్గయారే ఒబామా మూలకథతో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ఆడియోను అక్టోబర్ 30న పెద్ద ఎత్తున విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆడియోతో పాటు థియేట్రికల్ ట్రైలర్ను కూడా విడుదల చేశారు.
ఇప్పటికే టీజర్తో సినిమా ఏ రేంజ్లో ఉండనుందనే విషయాన్ని రుచి చూపించిన ‘శంకరాభరణం’ టీమ్, ట్రైలర్తో మరింతగా ఆకట్టుకుంటోంది. ‘బీహార్లో ఐదే ఐదు విషయాలు ఫేమస్’ అంటూ ఆసక్తికరంగా మొదలయ్యే ఈ ట్రైలర్ సినిమాలో ఏమేం ఉండనున్నాయనే విషయాన్ని స్పష్టంగా చూపించాయి. నిఖిల్ ఈ సినిమాలో ఓ ఎన్నారైగా కనిపించనున్న విషయం తెలిసిందే. ఒక ఎన్నారై బీహార్ ప్రాంతంలో చిక్కుకుపోవడమనే అంశం చుట్టూ ఈ సినిమా కథ ఉంటుందనే విషయాన్ని ట్రైలర్ తెలియజేస్తుంది.
ఇక ఈ ట్రైలర్లో హై క్లాస్ విజువల్స్, డైలాగ్స్, కామెడీ తదితర అంశాలు మేజర్ హైలైట్గా కనిపిస్తున్నాయి. అంజలి స్పెషల్ రోల్ సినిమాకు ఓ హైలైట్గా నిలుస్తుందన్న విషయం ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ఇక ఈ ట్రైలర్తో సినిమాపై ఇప్పటివరకూ ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయనే చెప్పాలి. నిఖిల్ సరసన నందిత హీరోయిన్గా నటించిన ఈ సినిమా నవంబర్ మూడో వారంలో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

