గత రెండు రోజులుగా నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్కు శస్త్ర చికిత్స జరుగుతుందని, జరిగిందని జోరుగా ప్రచారం జరిగింది. కమల్ ఉన్నట్టుండి ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయడంతో ఆ వెంటన్ ఏఈ తరహా ప్రచారం జరగడంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు కంగారుకు గురయ్యారు. అసలు కమల్ హాసన్కు ఏమైందో తెలుసుకోవాలనే ఎంక్వైరీ మొదలుపెట్టారు. అయితే కమల్ కుమార్తె, సినీ నటి శృతి హాసన్ ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు.
తన తందరికి శస్త్ర చికిత్స జరిగిన మాట వాస్తవమేనని, కానీ కంగారుపడాల్సింది ఏమీ లేదని చెప్పుకొచ్చారు ఆమె. కొన్నిరోజులుగా కాలినొప్పితో బాధపడుతున్న ఆయనకు చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్లో సర్జరీ జరిగిందని, ఇంకో నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని, పూర్తిగా కోలుకున్నాక తిరిగి ప్రజల దగ్గరకు వెళతారని చెప్పుకొచ్చింది శృతి. త్వరలో తమిళనాడు ఎన్నికలు రానున్నాయి. వాటి కోసం ఇప్పటికే తన పార్టీ తరపున ప్రచారం స్టార్ట్ చేశారు కమల్. ఇక మీదట ఇంకా ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. అందుకే ఉన్న చిన్నపాటి సమస్యను చక్కబెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆయన శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు 2’, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ అనే సినిమాలు చేస్తున్నారు.