నల్లమల అడవుల్లో ఉన్న యురేనియం నిక్షేపాలను వెలికితీయాలని కేంద్ర ప్రభుత్వం అనుకోవడంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో నిరసన గళాలు వినిపిస్తున్నాయి. ముందుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ విషయంపై విస్తృత స్థాయిలో విచారణ జరిపి యురేనియం తవ్వకాలతో అడవులు నాశనం కావడంతో పాటు నీరు, గాలి కాలుష్యం అవుతాయని, లక్ష మంది ప్రజల బ్రతుకులు, జంతు, పక్షి జాతులు నాశనం అవుతాయని, తవ్వకాలు జరపరాదని నిరసన తెలిపారు.
భావితరాలకు బంగారు తెలంగాణ ఇస్తామా.. యురేనియం కాలుష్య తెలంగాణ ఇస్తామా అంటూ అందరికీ ప్రశ్న సంధించారు. ‘సేవ్ నల్లమల’ క్యాంపైన్ ప్రారంభించి అందరూ మద్దతు తెలపాలని కోరారు. దీంతో జనం నుండే కాక సినీ రంగం నుండి కూడా నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరపరాదనే డిమాండ్ మొదలైంది. ముందుగా విజయ్ దేవరకొండ ‘సేవ్ నల్లమల’కు మద్దతు తెలపగా తాజాగా వరుణ్ తేజ్, రామ్, మంచు మనోజ్, సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోలంతా వారితో పాటే సేవ్ నల్లమల అంటూ ప్రకృతిని నాశనం చేయవద్దని అంటున్నారు.