తెలుగు కమెడియన్ కమ్ హీరో శ్రీనివాస్ రెడ్డి.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి, తన పేరు పై నకిలీ ఫేస్బుక్ సృష్టించి.. కొంతమంది అమాయకులను తన పేరు చెప్పి మోసం చేస్తున్నాడని సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్తే.. అమీర్పేటకు చెందిన రవికిరణ్ అనే వ్యక్తి, గత కొంత కాలంగా కొంతమంది సినిమా ఆర్టిస్టుల దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు. కాగా ఇప్పుడు ఆ పరిచయాలను వాడుకొని.. ఆ ఆర్టిస్టుల పేర్ల పై నకిలీ ఫేస్బుక్ లను సృష్టించి… చాటింగ్ ద్వారా సినిమా అవకాశాలు ఇప్పిస్తానని, మరికొంత యువకుల దగ్గర మంచి కథలు ఉంటే చెప్పమని.. ఇలా కొంత కాలంగా రకరకాలుగా వారిని మభ్య పెడుతూ వస్తున్నాడు.
అయితే తాజాగా ఈ విషయం గురించి తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి, ఆ పేస్ బుక్ వ్యక్తికీ.. తనకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఎవరో కావాలని తన పేరును మిస్ యూజ్ చేస్తున్నారని.. అలాంటి వారి పై.. తగిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ రెడ్డి సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు రవికిరణ్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం అంగీకరించిన అతనికి, పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి.. మళ్లీ ఎప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించి వదిలిపెట్టారు.