
‘ఏ మాయ చేసావే’ లాంటి అందమైన ప్రేమకథను తెలుగు తెరకు అందించిన గౌతమ్ మీనన్, నాగ చైతన్యలు మరో సినిమా కోసం సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సౌతిండియాలోని హైవేలలో పలు అందమైన లొకేషన్లలో జరుగుతోంది. ఇక ఈ ఉదయమే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయమొకటి బయటకొచ్చింది.
తెలుగులో స్టార్ రైటర్గా పేరొందిన కోన వెంకట్ ఈ సినిమాకు రచయితగా పనిచేయనున్న విషయాన్ని తెలియజేశారు. అదేవిధంగా ఈ సినిమాకు కోన వెంకట్ సహ నిర్మాతగానూ వ్యవహరిస్తుండడం విశేషం. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో నిర్మితమవుతున్న ఈ సినిమాను కోనవెంకట్ మిత్రుడు రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తమిళంలో శింబు హీరోగా నటిస్తున్నారు. తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ మంజీమా మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. గౌతమ్ మీనన్ మార్క్ ఎమోషనల్ లవ్స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.