సూపర్స్టార్ మహేష్ బాబు హీరోగా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. 2020 సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్గా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ విడుదల చేసిన ఓ వీడియో సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
‘భగభగభగ మండే నిప్పుల వర్షమొచ్చినా… జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు… ఫెళఫెళఫెళమంటూ మంచు తుఫాను వచ్చినా.. వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు…. ‘ అంటూ భారత సైనికుల ధైర్యాన్ని తెలియజేస్తూ సాగింది ఈ పాట. ఇక సూపర్ స్టార్ మహేష్ సరసన ఈ సినిమాలో రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి, ప్రకాష్ రాజ్ , రాజేంద్రప్రసాద్, సంగీత, బండ్ల గణేష్ నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.