తెలుగు సినిమా షూటింగ్స్ పై ఓ క్లారిటీ వచ్చేసింది.!

తెలుగు సినిమా షూటింగ్స్ పై ఓ క్లారిటీ వచ్చేసింది.!

Published on May 22, 2020 7:44 PM IST

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల మూలాన అన్ని సినిమా ఇండస్ట్రీలతో పాటు టాలీవుడ్ కూడా ఇన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ సినిమానే నమ్ముకొని ఉన్న ఎందరికో మంచి చేకూరాలన్న ధృడ నిషాయంతో సినీ పెద్దలు అంతా కదలి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కెసిఆర్ తో జరిపిన చర్చలు ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చాయి.

ఈరోజు సినిమారంగ ప్రముఖులతో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సినీ రంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డి.సురేష్ బాబు, అల్లు అరవింద్, ఎన్.శంకర్, రాజమౌళి, దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, కిరణ్, రాధాకృష్ణ, కొరటాల శివ, సి.కల్యాణ్, మెహర్ రమేశ్, దాము తదితరులు పాల్గొనగా..

సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్ పునరుద్ధరణ, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించారు. సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని, సినిమా థియేటర్లు తెరిచే అవకాశం ఇవ్వాలని సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీని తో సిఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి సినీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది కోసం రీ ప్రొడక్షన్, షూటింగు నిర్వహణ మరియు థియేటర్లలో ప్రదర్శనలను దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని సిఎం అభిప్రాయం వ్యక్తం చేసారు.

అందులో భాగంగా తక్కువ మందితో, ఇండోర్ లో చేసే వీలున్న రీ ప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని, తర్వాత దశలో జూన్ మాసంలో సినిమా షూటింగులు ప్రారంభించాలని, చివరగా పరిస్థితిని బట్టి, సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సినీ పరిశ్రమ బతకాలని, అదే సందర్భంగా కరోనా వ్యాప్తి కూడా జరగవద్దని సిఎం తెలిపారు.

అందుకోసం సినిమా షూటింగులను వీలైనంత తక్కువ మందితో లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ, కరోనా వ్యాప్తి నివారణకు అనుసరిస్తున్న మార్గదర్శకాల ప్రకారం నిర్వహించుకోవాలని చెప్పారు. ఎంత మందితో షూటింగులు నిర్వహించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనే పలు ఇతర అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై చర్చించాలని సినీ రంగ ప్రముఖులను ముఖ్యమంత్రి కోరారు.

ఆ తర్వాత ప్రభుత్వం ఖచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించి, షూటింగులకు అనుమతి ఇస్తుందని సిఎం వెల్లడించారు. కొద్ది రోజులు షూటింగులు నడిచిన తర్వాత, అప్పటికే పరిస్థితిపై కొంత అంచనా వస్తుంది కాబట్టి, సినిమా థియేటర్లు ఓపెన్ చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని సిఎం కెసిఆర్ ఫైనల్ గా ఒక కంక్లూజన్ ఇచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు